AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 1:06 pm Posted by : ayudam desk

భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి

ఆయుధం న్యూస్ ములుగు
భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని,సాదా బైనామా, రీ-సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలని,రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్, పలు జిల్లాల కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా, నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే, నక్షా కార్యక్రమం తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ములుగు జిల్లా నుండి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ ‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్, ఐఏఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భూధార్ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి భూ యజమానికి ఖచ్చితమైన భూ వివరాలు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి కార్యక్రమం కింద వచ్చిన దరఖాస్తులను ఎటువంటి జాప్యం లేకుండా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసి అర్హులైన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, భూములకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని పేర్కొన్నారు.జిల్లాల్లో కొనసాగుతున్న నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఎంపిక చేసిన గ్రామాల్లో నక్షా డిజిటల్ భూ మ్యాపింగ్ పనులను నాణ్యత ప్రమాణాలతో అమలు చేయాలని ఆదేశించారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ భూ రికార్డుల ఆధునీకరణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.