ఆయుధం న్యూస్ వరంగల్,
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న 4,309 గుడిసెల వివరాలను సోమవారం నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిజంగా గుడిసెలు ఉన్న అర్హుల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.సేకరించిన జాబితాను గ్రామైక్య సంఘాలకు అందజేసి, వారు పరిశీలించి తీర్మానం చేసిన అనంతరం ఎంపీడీఓలకు పంపించాలని సూచించారు. పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. తొలి దశలో మంజూరైన 5,373 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవడంతో పాటు, ఇంటింటికి ఆరు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వై.వి. గణేష్, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, డీఆర్డీఓ నాగ పద్మజ, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.