ఆయుధం న్యూస్ హనుమకొండ :
కేంద్ర అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో పాటు విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” (తల్లి పేరుతో ఒక మొక్క) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి సోమవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పట్ల ప్రేమ, గౌరవాన్ని చాటుతూ ఆమె పేరుతో ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మరియు సాధారణ ప్రజలు పాల్గొనవచ్చని తెలిపారు. తల్లి పేరుతో మొక్కను నాటి, ఆ మొక్కతో తీసుకున్న సెల్ఫీ ఫోటోను సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేస్తే, పాల్గొన్న వారికి డిజిటల్ సర్టిఫికెట్ అందజేయబడుతుందని వివరించారు.పర్యావరణ పరిరక్షణతో పాటు భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ రవి, డి ఆర్ ఓ శ్రీనివాస్, డీఈఓ గిరిరాజ్ గౌడ్, జిల్లా నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్జీసీ) కోఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస స్వామి, క్వాలిటీ కోఆర్డినేటర్ మన్మోహన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు