AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 6:05 pm Posted by : AYUDAM DAILY

మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

ఆయుధం న్యూస్ ఆదిలాబాద్
తెలంగాణ‌లో మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పించి, వారిని అన్ని రంగాల్లో పోటీతత్వానికి సిద్ధం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడలో 20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల–కళాశాల (బాలుర) భవనాన్ని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ఫహీమ్ ఖురేషీతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన భవనంలోని తరగతి గదులు, వసతి గదులు, భోజనశాల, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.మైనార్టీ విద్యార్థులు విద్యనే ఆయుధంగా మలుచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. విద్యా రంగంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని మైనార్టీ విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన బోధనా వాతావరణాన్ని అందిస్తోందని తెలిపారు. ఇలాంటి విద్యాసంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు మరింత మెరుగుపడతాయని అన్నారు.అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీ జి. నగేష్, శాసనసభ్యుడు పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష,జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.