ఆయుధం న్యూస్ హన్మకొండ
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, జంతు జనాభా నియంత్రణ కార్యక్రమాల పురోగతిని బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ముందుగా బాలసముద్రంలోని బయో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్, జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం, పొడి వ్యర్థాల వేరు చేసే కేంద్రాలను సందర్శించిన కమిషనర్, అక్కడ అమలవుతున్న ప్రక్రియలను పరిశీలించి నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు
.
అనంతరం హసన్పర్తిలోని జంతు జనాభా నియంత్రణ (ఏబీసీ) కేంద్రాన్ని సందర్శించి వీధి కుక్కలకు నిర్వహిస్తున్న శస్త్రచికిత్సలు, చికిత్సా విధానాలు, సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రానికి అనుబంధంగా నిర్మిస్తున్న నూతన కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తదుపరి మడికొండలోని డంపింగ్ యార్డును సందర్శించిన కమిషనర్, బయోమైనింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు ఎంత మేర బయో మైనింగ్ ద్వారా పాత వ్యర్థాల తొలగింపు పూర్తయిందో అధికారులను అడిగి తెలుసుకుని, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.అదేవిధంగా పదార్థాల పునర్వినియోగ కేంద్రం (ఎం ఆర్ ఎఫ్), సంపీడిత బయోగ్యాస్ ప్లాంటు(సిబిజి) ఏర్పాటుకు స్థలం గుర్తించిన నేపథ్యంలో, వెంటనే పనుల ప్రణాళిక రూపొందించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యత, వేగం, శాస్త్రీయ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందేలా అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో సీఎం హెచ్ ఓ రాజారెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్ మహేందర్, జీడబ్ల్యూఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
