AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:06 pm Posted by : AYUDAM DAILY

సమాజ రుగ్మతలపై అక్షరాయుధం జాషువా రచనలు

ఆయుధం న్యూస్ పశ్చిమ గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రత్న మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం మాట్లాడుతూ,సమాజంలో నెలకొన్న అంటరానితనం,కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలపై గుర్రం జాషువా తన కలంతో అక్షర పోరాటం చేశారని కొనియాడారు. చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, సమాజంపై ద్వేషం పెంచుకోకుండా మానవతా దృక్పథాన్ని చాటిన “విశ్వనరుడు” జాషువా అని ప్రశంసించారు.ఆయన రాసిన ‘గబ్బిలం, ‘ఫిరదౌసి’ వంటి కావ్యాలు తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని వివరించారు. అనంతరం తెలుగు విభాగాధిపతి బూసి వెంకటస్వామి  మాట్లాడుతూ, సమసమాజ స్థాపన కోసం జాషువా చేసిన కృషిని, ఆయన కవితా విశిష్టతను నేటియువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.సామాజిక అసమానతలపై అక్షరాయుధాన్ని ఎక్కుపెట్టిన జాషువా రచనలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ, జువాలజీ విభాగాధిపతి రామకృష్ణ,ఆంగ్ల విభాగాధిపతి కె శామ్యూల్, అధ్యాపకులు విజయలక్ష్మి, వంశీ సుబ్బరాయన్, శ్రీనివాస్, శిరీష, శివకృష్ణ ,పార్థసారథి, శ్రీనివాసరావు, బి.కె.వి.రామలక్ష్మి, మన్మధరావు, ఆశాజ్యోతి, శిరీషా, స్వర్ణలత,రవికుమార్, సూపరింటెండెంట్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.