AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 3:51 pm Posted by : AYUDAM DAILY

పారదర్శకంగా, పకడ్బందీగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ

ఆయుధం న్యూస్ హనుమకొండ:

హ‌నుమ‌కొండ‌ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–Special Intensive Revision) ప్రక్రియ అధికారులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి తెలిపారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అధికారులతో పాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని ఇన్‌చార్జి కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి, వరంగల్ పశ్చిమ ఈఆర్‌వో, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు తొలుత నిర్ణయించిన ఆగస్టు 3 గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 10 వరకు పొడిగించిందని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలులో హనుమకొండ జిల్లా మంచి గుర్తింపు పొందిందన్నారు.జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి నిరంతర సమీక్షలు, సమన్వయ చర్యలతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఎల్‌వోల ద్వారా సేకరించిన ఎస్‌ఐఆర్ దరఖాస్తుల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోందని, ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను రీ-వెరిఫికేషన్ చేస్తున్నట్లు చెప్పారు.ఇప్పటికీ ఎస్‌ఐఆర్ ఫారాలను సమర్పించని ఓటర్లు గడువులోగా సంబంధిత బీఎల్‌వోలకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం లేదా జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో హనుమకొండ తహశీల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.డి. నేహాల్, బీజేపీ తరఫున రావు అమరేందర్ రెడ్డి, ఎలుక నిశాంత్, బీఆర్ఎస్ తరఫున బి. ప్రవీణ్ కుమార్, టీడీపీ తరఫున కుసుమ శ్యామ్ సుందర్, వైఎస్సార్సీపీ తరఫున నాగబెల్లి రజనీకాంత్, ఏఐఎంఐఎం తరఫున సయ్యద్ ఫైజుల్లా, అబ్దుల్ సత్తార్, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.