ఆయుధం న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ ఆవరణలో చేపడుతున్న ప్లానిటోరియం పునరుద్ధరణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.మంగళవారం కమిషనర్ ప్లానిటోరియం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులను పరిశీలించి, మిగిలిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లానిటోరియం డోమ్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినందున ఇకపై పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా, నిరంతర పర్యవేక్షణతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్లానిటోరియంలోని ప్రధాన హాల్లో ఖగోళ శాస్త్రం, విజ్ఞానం, సైన్స్కు సంబంధించిన ఆధునిక ఎగ్జిబిట్లు, ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ప్లానిటోరియాన్ని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు.
అదేవిధంగా ప్లానిటోరియం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, హరితీకరణ, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కమిషనర్ పేర్కొన్నారు.
అన్ని పనులను సమన్వయంతో పూర్తి చేసి, అక్టోబర్ 2 నాటికి ప్లానిటోరియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రోజారాణి, రాజ్కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ హరీకుమార్, కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.