AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:40 pm Posted by : AYUDAM DAILY

తల్లిపాలే శిశువుకు తొలి టీకా – తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ సత్య శార

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్  ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గ‌రువారం వరంగల్ సి.కె.ఎం. ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిపాల అవగాహన కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు ప్రజలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సంద‌ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన మొదటి గంటలోపే వచ్చే ముర్రుపాలను (Colostrum) తప్పనిసరిగా శిశువుకు పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు.
తల్లిపాలు తాగిన పిల్లలకు డయేరియా, న్యుమోనియా, కామెర్లు (జాండిస్) వంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుందని, మెదడు ఎదుగుదల మెరుగుపడుతుందని, తల్లి-బిడ్డల మధ్య అనుబంధం బలపడుతుందని పేర్కొన్నారు. తల్లులకు ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం, స్థూలకాయం తగ్గడం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.శిశువుకు మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆతరువాత తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన పరిపూరక ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలింతలు తగినంత నీరు తాగుతూ, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లిపాల ఉత్పత్తి మెరుగుపడుతుందని తెలిపారు.అవసరానికి మించి తల్లిపాలు ఉత్పత్తి అయ్యే తల్లులు మిల్క్ బ్యాంక్‌కు పాలను దానం చేయాలని, ఆ పాలను అవసరమైన శిశువులకు అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అలాగే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు కంగారూ మదర్ కేర్ (Kangaroo Mother Care) విధానాన్ని పాటించడం ద్వారా వెచ్చదనం, రక్షణ మరియు మెరుగైన ఎదుగుదల లభిస్తుందని వివరించారు.గర్భధారణ సమయంలోనే సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని, సాధారణ ప్రసవం ప్రతి తల్లికి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతి అని, అవసరం లేనప్పుడు శస్త్రచికిత్స ప్రసవాలను ప్రోత్సహించకూడదని సూచించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లిపాల ప్రాముఖ్యతతో పాటు కంగారూ మదర్ కేర్ విధానంపై రోల్ ప్లే ప్రదర్శించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజా రెడ్డి, సి.కె.ఎం. ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మిదేవి జిల్లా సంక్షేమ అధికారిని రాజమణి, ప్రోగ్రామ్ అధికారులు, ప్రకాష్, రాజమౌళి, సజిదా, ఇక్తాదార్ అహమ్మద్, అరుణ్ జోషి, ఆర్.ఎం.ఓ. డా. సృజన్ బాబు, యు.ఎఫ్.డబ్ల్యూ.సి. వైద్య అధికారి డా. దిలీప్ కుమార్, లెక్చరర్ ఇన్ కమ్యూనికేషన్ (డెమో) అబ్దుల్లా బాబా, డిప్యూటీ డెమో ఎస్. వెంకటేశ్వర్లు, నర్సింగ్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.