AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:27 pm Posted by : AYUDAM DAILY

డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను డిజిటల్‌ క్రాప్‌ సర్వే యాప్ లో పకడ్బందీగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామ పరిధిలోని చింతకుంట లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతున్న తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు, సాంకేతిక వ్యవస్థ పనితీరు, జియో మ్యాపింగ్‌, పంటల ఫొటోల నమోదు, తదితర అంశాలను పరిశీలించడంతో పాటు స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి రైతుకు సంబంధించిన సర్వే నంబర్‌లో సాగు చేస్తున్న పంట రకం, సాగు విస్తీర్ణం తదితర వివరాలను డిజిటల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో నమోదయ్యే సమాచారం భవిష్యత్తులో వివిధ వ్యవసాయ సేవలకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉన్నందున, ఎలాంటి తప్పులు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి ఏడీఏ రాజ్‌కుమార్‌, వ్యవసాయ అధికారి సునీల్‌తో పాటు ఇతర అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.