ఆయుధం న్యూస్ హనుమకొండ: జర్నలిస్టుల హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శి ఉట్కూరు సీతారామారావు (సాయిరాం) తెలిపారు. బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. త్వరలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లా కమిటీ బాధ్యులు మండలాల వారీగా పర్యటించి అక్కడి జర్నలిస్టులతో సమావేశాలు నిర్వహించి సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు. సమావేశంలో సభ్యులు పలు సలహాలు, సూచనలు అందించారు. జర్నలిస్టుల కుటుంబాలకు మెరుగైన వైద్య సదుపాయాలు, పిల్లలకు విద్యలో రాయితీలు, బీమా సౌకర్యం తదితర అంశాలపై చర్చించారు. సభ్యుల సూచనలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని నాయకులు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి పొడిచెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు దండు మోహన్, ఇమ్మడి ప్రసాద్, కమిటీ బాధ్యులు రామారావు, సాంబశివరావు, రాధాకృష్ణ, ఓదేలు, సంతోష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
