ఆయుధం న్యూస్ హన్మకొండ
జనం సమస్యలకు జనం బాషను, జనం యాసను, జోడించి సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప కవి, కళాకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ సాహిత్యంలో లెజెండ్ అని జననాట్యమండలి నాయకుడు సంజీవ్ అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో గద్దర్ గళం ఆధ్వర్యంలో విసికె పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం జరిగిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన ఆయన మాట్లాడారు. తరతరాలుగా దేశంలో జరుగుతున్న దోపిడి, దేశ భూస్వామ్య, పాలకుల దోపిడీకి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ తోడై దోపిడి ఎలా కొనసాగిందో, ఆ దోపిడిలో చిక్కుకున్న ప్రజలు ఎలా విలవిలలాడారో గద్దర్ ప్రతి పాటలో కనపడుతుందని అన్నారు. ప్రజల అజ్ఞానం, మూఢనమ్మకాలు, పాలకుల దోపిడి, పోలీసుల ప్రవర్తనపై ప్రజల బాషలో, పలు భాషల్లో పాడి ప్రజలను చైతన్యం చేసి ప్రజా యుద్ధానికి సిద్ధం చేసిన యుద్ధ నౌక గద్దర్ ప్రపంచంలోనే గొప్పవాడని అన్నారు. గద్దర్ అజ్ఞాతంలో ఉన్నపుడు అన్న కోసం మూడు సంవత్చరాలు ఆటో నడిపి గద్దరన్నను సాధుకున్నట్లు ఆవేదనతో మాట్లాడాడు. సాంస్కృతిక ఉద్యమంలో నిర్మాణాత్మకమైన సమస్యల గురించి గద్దర్ వ్రాశాడని, సామ్రాజ్యవాదం గురించి, అమెరికా దోపిడి గురించి రచించి పాడిన గద్దర్ కార్మికుల గురించి, కర్షకుల గురించి, మహిళల గురించి, కూలీల గురించి, తల్లుల త్యాగం గురించి, విద్యార్థుల త్యాగాల గురించి ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా చైతన్యపరిచి తన జీవితాంతం పోరాటం చేశాడని అన్నారు. ఆయా వర్గాల సమస్యలపై, ప్రజల విముక్తికై గద్దరన్న పాడిన పాటలను సంజీవన్న పాడి సభను ఉత్తేజపరిచారు.
