ఆయుధం న్యూస్ హనుమకొండ,
పట్టణాల్లో నీటి భద్రతను బలోపేతం చేయడంతో పాటు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న విధానాలు, సమర్థవంతమైన పాలనా వ్యవస్థలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్పాయ్ తెలిపారు.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 8వ తేదీ వరకు ఇజ్రాయెల్లోని వివిధ నగరాల్లో అర్బన్ వాటర్ మేనేజ్మెంట్పై నిర్వహించిన అధ్యయన పర్యటనలో కలెక్టర్ చాహాత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్లో పట్టణ నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం, నీటి మౌలిక వసతుల నిర్వహణ వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి కొరతను సవాలుగా కాకుండా సాంకేతికత, ఆవిష్కరణలు, సమర్థవంతమైన పాలన ద్వారా అవకాశంగా మార్చుకోవడంలో ఇజ్రాయెల్ అనుభవాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించడం, శుద్ధి చేసిన మురుగునీటిని దాదాపు 90 శాతం వరకు వ్యవసాయ అవసరాలకు పునర్వినియోగించడం, GIS ఆధారిత నీటి మౌలిక వసతుల మ్యాపింగ్, నాన్-రెవెన్యూ వాటర్ (NRW)ను 5 శాతం కంటే తక్కువ స్థాయిలో నియంత్రించడం వంటి విధానాలు పట్టణ నీటి నిర్వహణలో ఇజ్రాయెల్ సాధించిన పురోగతికి నిదర్శనమని తెలిపారు.అదేవిధంగా నదుల పునరుజ్జీవనం, పట్టణ జల వనరుల పరిరక్షణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, ఎడారీకరణ నివారణకు చేపడుతున్న పరిశోధనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నీటి నిర్వహణలో విస్తృతంగా వినియోగిస్తున్న తీరును అధ్యయనం చేసినట్లు తెలిపారు.
అధ్యయన పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్లో భారత రాయబారి శ్రీ జె.పి. సింగ్ను కలుసుకుని భారత్–ఇజ్రాయెల్ సహకారం, ముఖ్యంగా పట్టణ నీటి నిర్వహణ రంగంలో ఇరు దేశాల మధ్య ఉన్న అవకాశాలు, అనుభవాలపై ఆయన నుంచి విలువైన సూచనలు, అభిప్రాయాలను తెలుసుకున్నట్లు కలెక్టర్ చాహాత్ బాజ్పాయ్ తెలిపారు.
ఈ అధ్యయన పర్యటన ద్వారా పొందిన అనుభవాలు వరంగల్ నగర అండర్గ్రౌండ్ సీవరేజ్ సిస్టమ్ (UGSS), తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, GIS ఆధారిత నీటి మౌలిక వసతుల నిర్వహణ, నాన్-రెవెన్యూ వాటర్ తగ్గింపు, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం, పట్టణ చెరువులు, కుంటలు, ఇతర జల వనరుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల్లో ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
