ఆయుధం న్యూస్ వరంగల్
వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోూత్సవములు ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని కాళీ క్రమాన్ని అనుసరించి ఉగ్రా నిత్యా గాను షోడశీ క్రమాన్ని అనుసరించి జ్ఞానశక్తిని శివదూతీమాతగాను అలంకరించి పూజారాధనలు నిర్వహించారు. ఏతిథికి ఏదేవత అధిదేవతో ఆదేవతను ఆరాధించడం వల్ల ఆరోజంతా శుభప్రదమౌతుందని జ్యోతిశ్శాస్త్రం చెప్పడం వల్ల మంగళవారం కావడం వల్ల భక్తులందరికీ ఈ రోజు శుభప్రదం కావాలని ఆలయంలో అర్చకులు ముందుగా సుబ్రహ్మణ్య ఆరాధన జరిపారు. దశమహావిద్యలలోని కాళీ క్రమాన్ని అనుసరించి ఏడవ రోజుకు అధిదేవత ఉగ్రామాత, ఈమెను ఉగ్రతారా అని కూడా అంటారు. ఈమెయే శ్రీరాముని చైతన్య శక్తిగా తంత్రాలు చెబుతున్నాయి. ఈమెను ఉపాసించిన వారికి సామ్రాజ్యైశ్వర్యము, శత్రువిజయము, కలుగుతాయి. అట్లాగే షోడశీ క్రమాన్ని అనుసరించి ఏడవ రోజుకు అధిదేవత శివదూతి అమ్మవారు. అమ్మవారి జ్ఞానశక్తిని శివదూతిమాతగా అలంకరించి ఆరాధించారు. అమ్మవారు రాక్షసులను పాతాళానికి వెళ్ళిపోయి జీవించమని తనమాటగా చెప్పమని శంకరుని శుంభాసురుని దగ్గరికి దూతగా పంపుతుంది. అప్పటి నుండి అమ్మవారిని శివదూతిగా శాస్త్రాలు కీర్తించాయి. శివదూతి అమ్మవారిని సేవించడం వల్ల అపరిష్కృతంగా ఉన్న వ్యవహారాలన్నీ చక్కబడతాయని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తన జన్మోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ఉదయం ఆలయానికి విచ్చేసి అమ్మవారికి విశేష అభిషేక, అర్చనాదులు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు నాయిని రాజేందర్ రెడ్డి దంపతులకు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారికి శేషవస్త్రములు బహూకరించారు. వరంగల్ పోలీస్ కమీషనర్ శ్వేత రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. డోర్నకల్ ఎమ్మేల్యే జటోత్ రాంచందర్ నాయక్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. పూజానంతం అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించి శేషవస్త్రాలు అందజేశారు. అమ్మవారిని సుమారు పది వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత తెలిపారు.
