ఆయుధం న్యూస్ వరంగల్
ఖరీఫ్ సీజన్లో రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద సూచించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ సోమవారం నాడు ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ రకాల విత్తనాల స్టాళ్లను సందర్శించి, వాటి నాణ్యత, అందుబాటు, వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు గుర్తింపు పొందిన సంస్థల ద్వారా సరఫరా చేసే ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని సూచించారు.విత్తనాల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, విత్తనాల సంచులపై ఉన్న వివరాలను పరిశీలించిన తర్వాతే వినియోగించాలని అన్నారు.వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని, రైతులు ప్రభుత్వ సూచనలను పాటించి శాస్త్రీయ విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్,ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు,నల్లబెల్లి ఏ .ఓ, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
