ఆయుధం న్యూస్ హనుమకొండ:
వెల్ నెస్ సెంటర్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ
జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎన్. రవి అన్నారు.సోమవారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల పక్కన ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లకు వైద్య సేవలను అందించే వెల్ నెస్ సెంటర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెల్ నెస్ సెంటర్ లోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, కంటి విభాగం, ల్యాబ్, ఫార్మసీ, ఓపీ విభాగాలను పరిశీలించారు. ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధులకు హాజరయ్యారని అదనపు కలెక్టర్ వెల్ నెస్ సెంటర్ ఇన్ ఛార్జీ డాక్టర్ సుష్మితను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. అక్కడికి వైద్య సేవల నిమిత్తం వచ్చిన పేషంట్లతోనూ మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉంటున్నాయని అడిగారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ వెల్ నెస్ సెంటర్ కు వచ్చే పేషంట్లకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. వెల్ నెస్ సెంటర్ వద్ద పరిసరాలు బాగుండాలన్నారు. ప్రత్యేక విభాగాల వైద్య నిపుణుల చేత కూడా వైద్య సేవలను పేషంట్లకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ల్యాబ్ ద్వారా పేషంట్లకు అవసరమయ్యే వివిధ పరీక్షలని నిర్వహించాలన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, వైద్యులు పాల్గొన్నారు.
