ఆయుధం న్యూస్ వరంగల్
జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం (NVHCP) అమలులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హై-రిస్క్ గ్రూపులకు హెపటైటిస్-బి (Hepatitis-B) వ్యాక్సినేషన్ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హెపటైటిస్-ఎ (Hepatitis-A), హెపటైటిస్-ఈ (Hepatitis-E) వ్యాప్తిని నివారించేందుకు తాగునీటి వనరుల క్లోరినేషన్ను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.హెపటైటిస్ లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, రక్తదాతలకు తప్పనిసరిగా హెపటైటిస్ స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. హై-రిస్క్ గ్రూపులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా హెపటైటిస్ వ్యాధిపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.జిల్లాలో వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేసి, వ్యాధి నివారణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి, నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరి, జిల్లా వైరల్ హెపటైటిస్ నోడల్ అధికారి డాక్టర్ ఉష, డీసీహెచ్ఎస్ వర్ధన్నపేట డాక్టర్ రాంమూర్తి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వర్ధన్నపేట డాక్టర్ రాజమౌళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ సంయుక్త, సభ్యులు స్వప్న మాధురి, లైలా, చందు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
