హనుమకొండ జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయాలని భూములు కొలతల శాఖ అధికారులు, సర్వేయర్లను హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి ఆదేశించారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ చాంబర్ లో భూముల రీసర్వే పురోగతిపై భూములు కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లతో ఇన్చార్జి కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని 9 మండలాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ఎంతవరకు పూర్తయిందనే వివరాలను భూములు కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లను ఇన్ఛార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వేకు రైతులు సహకరిస్తున్నారని, భూ సమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని సర్వేయర్లు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ భూముల రీ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలోనే 9 మండలాలలో భూముల రీ సర్వే జరుగుతున్న జిల్లాగా హనుమకొండ జిల్లాకు గుర్తింపు ఉందని, కాబట్టి రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. సర్వేయర్లు భూముల రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయడంలో లైసెన్సుడ్ సర్వేయర్ల సహకారం తీసుకోవాలన్నారు. భూముల రీ సర్వే తో భూ సమస్యలు తొలగిపోతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, గ్రామాలలో రీ సర్వే బృందాలకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే వేగవంతంగా జరుగుతుందని, సర్వేయర్ల పనితీరు బాగుందని తెలిపారు.
ఈ సమావేశంలో భూములు కొలతల శాఖ ఏడి నూర్ సింగ్, డిఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు.
