ఆయుధం న్యూస్ హైదరాబాద్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం హై అలర్ట్ తో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శితో సహా సీనియర్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు కురిసిన సందర్భాల్లో నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు సత్వరం తీసుకోవాలని చెప్పారు. వర్షాలపై వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందస్తు ప్రణాళికతో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బృందాలను మోహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
