ఆయుధం న్యూస్ వరంగల్:
“సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ అనే నినాదంతో మాదకద్రవ్యాల నిర్మూలన, యువతలో చైతన్యం కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ నగరంలో భారీ 2K రన్ నిర్వహించారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ ర్యాలీ నగర ప్రధాన వీధుల మీదుగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు కొనసాగింది. “మాదకద్రవ్యాలు వద్దు – ఆరోగ్యమే ముద్దు”, “డ్రగ్స్ ఫ్రీ వరంగల్” వంటి నినాదాలతో విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజపాయి, ట్రాన్స్కో సీఎండీ వరుణ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి దార కవిత,డిసిపి అంకిత్ కుమార్,పలువురు జిల్లా అధికారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ర్యాలీ లో పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ముగింపు సభలో 2K రన్ విజేతలకు అతిథులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సంప్రిత్ సింగ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా నాశనం చేస్తాయని అన్నారు. యువత చెడు స్నేహాలు, క్షణిక ఆనందం కోసం డ్రగ్స్కు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కమిషనరేట్ పరిధిలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలని, ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. నాగరాజు మాట్లాడుతూ, డ్రగ్స్ సమస్య కేవలం పోలీసు శాఖదే కాకుండా సమాజం మొత్తానికి సంబంధించినదని అన్నారు.గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు అందరూ కలిసి యువతను క్రీడలు, యోగా, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
