ఆయుధం న్యూస్ హన్మకొండ
గ్రేటర్ వరంగల్ నగరానికి తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలవనరైన ధర్మసాగర్ రిజర్వాయర్ను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రిజర్వాయర్లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వలు, నగరానికి జరుగుతున్న తాగునీటి సరఫరా విధానం, నీటి శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యత, పంపింగ్ వ్యవస్థ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరంగల్ నగర ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అవసరమైన శుద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు.రిజర్వాయర్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలని తెలిపారు. తాగునీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పంపింగ్ స్టేషన్లు, పైప్లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం, తాగునీటి నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు.ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజ్కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ హరికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
