ePaper
Wednesday, July 8, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశించారు.వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె తొలిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి గల కారణాలు, కేసుల పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.తదుపరి పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు నమోదులు, ఇతర పరిపాలనా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలను తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రసీదు అందజేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించారనే నమ్మకం ప్రజల్లో కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను అనవసరంగా ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే అత్యవసర ఫిర్యాదుల విషయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, వెంటనే స్టేషన్ అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే శాఖాపరమైన సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఇకపై పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే సమర్పించాలని, వాటి పరిష్కార ప్రక్రియను స్టేషన్ అడ్మిన్ ఎస్‌ఐ పర్యవేక్షించి, బాధ్యతాయుతంగా నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!