ఆయుధం న్యూస్ హన్మకొండ
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో ధర్మసాగర్ మండలంలోని సాయిపేట, క్యాతంపల్లి, తాటికాయల, నర్సింగారావుపల్లి, ఎల్కుర్తి, కరుణాపురం గ్రామాలలో అభివృద్ధి పనులకు మంజూరు అయిన ఎస్డిఎఫ్ నిధుల మంజూరు పత్రాలను ఆయా గ్రామ సర్పంచులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు.సాయిపేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి డ్రైన్ ల నిర్మాణానికి 20లక్షలు,తాటికాయల గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హల్ ప్రహరీ గోడ నిర్మాణానికి 5లక్షలు, ఎల్కుర్తి గ్రామం ఏమ్మన్నగూడెంలో ముదిరాజ్ కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి 10లక్షలు, క్యాతంపల్లి గ్రామంలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి మరియు త్రాగు నీటి సమస్య పరిష్కానికి 6లక్షల 75వేలు, కరుణాపురం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి 4లక్షల 50వేలు, నర్సింగరావుపల్లి గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం మరియు ప్రాథమిక పాఠశాలలో మారమ్మత్తులకు 15 లక్షలు మొత్తం 61లక్షల 24వేల రూపాయల విలువగల అభివృద్ధి పనులకు మంజూరు పత్రాలను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఎదో ఒక అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జాతుగుతున్నాయని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే పని చేస్తున్నానని తెలిపారు. సర్పంచులు గ్రామాలలో పని చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు అవినీతి రహితమైన పాలన అందించాలని సూచించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో గాని, సంక్షేమ పథకాల అమలులో గాని అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు సమాకూర్చే బాధ్యత నాదని నిజాయితీగా పని చేసే బాధ్యత సర్పంచులదని వెల్లడించారు. అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
