ఆయుధం న్యూస్ వరంగల్:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన అంశాలను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుని, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా బల్దియా పరిధిలోని రాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం వరంగల్ పరిధిలోని రామన్నపేటలో డ్రైనేజీ నిర్మాణ పనులు, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షించారు. దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ నిర్వహణ, అభివృద్ధి పనులు, 12వ డివిజన్లో మున్నూరు కాపు సంఘం వద్ద సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు, పెరుక సంఘం సమీపంలో మిగిలిన అభివృద్ధి పనులు, లక్ష్మీ మేఘ టౌన్షిప్లో బీరన్నగుడి సమీపంలో హెచ్డీపీఈ పైప్లైన్ పనులు పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. 16వ డివిజన్లో గోవిందరాజుల గుట్ట వద్ద నిర్మిస్తున్న ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ పనులు, అదే డివిజన్లో కొనసాగుతున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. పైడిపల్లి ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు, లక్ష్మీపురంలో ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న అభివృద్ధి పనులు, జాన్పాక్ ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు కూడా పరిశీలించారు.అదేవిధంగా చింతల్, రంగశాయిపేట, ఉర్సు ప్రాంతాల్లో పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షిస్తూ, ప్రజలకు ఉపయోగపడే పనులను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవి కుమార్, సంతోష్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రంగారావు, సురేష్, అసిస్టెంట్ ఇంజనీర్లు రామన్న, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
